- జఫర్ఘడ్లో మా ఇల్లు అనాథాశ్రమంలో ఆదుపులోకి..
- ఉపా చట్టం కింద ఎన్ఐఏ అధికారుల కేసు
- నివాసం.. అనాథాశ్రమంలో అధికారుల సోదాలు
- మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నారనే ఆరోపణలు
- ఇటీవల హిడ్మా తల్లిని కలిసి మాట్లాడిన ఇన్నయ్య
- మావోయిస్టు వికల్ప్ అంత్యక్రియలకు హాజరు
- కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వ్యతిరేకంగా ప్రసంగం
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశమైన ఘటన
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జఫర్ఘడ్లోని ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో అధికారులు సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. మావోయిస్టులతో సంబంధాలు.. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నారనే ఆరోపణలతో ఇన్నయ్యను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఇన్నయ్య మాట్లాడారు. ఈనేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి.
భావోద్వేగ ప్రసంగం..
మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీష్గడ్ వెళ్లారు. సుక్మా జిల్లా పువర్తిలో హిడ్మా తల్లిని కలిశారు. అక్కడున్న నేషనల్, స్టేట్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లతో హిడ్మా మరణంపై ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఈసమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుబట్టారు. అదేవిధంగా ఇటీవల మరణించిన మరో మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపింది. తాజాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఉపా కేసు నమోదు చేసింది. కాగా, ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో 200 మంది అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు.


