కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలకు పూర్వ వైభవం
సర్పంచ్ పదవే రాజకీయ భవిష్యత్తుకు పునాది
గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్
మరిపెడలో రూ.26 కోట్లతో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం
కాకతీయ, మరిపెడ : గ్రామ అభివృద్ధికి సర్పంచ్నే కేంద్ర బిందువని, ప్రతి గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచేనని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలకు పూర్వ వైభవం తిరిగి వస్తుందని స్పష్టం చేశారు. శనివారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో డోర్నకల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ సర్పంచ్ పదవి రాజకీయ భవిష్యత్తుకు తొలి మెట్టని అన్నారు. గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసినందున సర్పంచులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని సూచించారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త యుద్ధ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
రూ.26 కోట్లతో 100 పడకల ఆసుపత్రి
అనంతరం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇకపై పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, ఆసుపత్రిలో సుమారు 40 మంది వైద్య సిబ్బంది సేవలు అందిస్తారని చెప్పారు. పేదల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రారంభిస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్ము యుగంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎస్.కె. తాజుద్దీన్, అఫ్జల్, ఐలమల్లు, గుండగాని వెంకన్న, వేణు, సాయి, అభినవ రెడ్డి, అంబరీష్, రామ్లాల్, కాలం రవీందర్ రెడ్డి, దశ్రు నాయక్, కమలాకర్ రెడ్డి, రాజశేఖర్, అంబటి వెంకటరెడ్డి, బట్టు నాయక్, రాము నాయక్, లక్ష్మీపతి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


