బీఆర్ఎస్లోకి నడికూడ మాజీ జడ్పీటీసీ
మాజీ ఎంపీటీసీటి సమ్మయ్య సైతం
రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు సమక్షంలో చేరిక
పరకాలలో కాంగ్రెస్కు గుడ్ బై చెబుతున్న నేతలు
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని నడికూడ మండలానికి చెందిన మాజీ జడ్పిటిసి కోడెపాక సుమలత కర్ణాకర్, మాజీ ఎంపిటిసి సమ్మయ్య ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు సమక్షంలో వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ తల్లిలాంటి పార్టీ అని, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకునే స్వభావం పార్టీకి ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణకు సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తితో ఇప్పటికే బీఆర్ఎస్లో భారీగా చేరికలు జరుగుతున్నాయని, స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక మరింత మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.


