ధరల నియంత్రణపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?
లోక్సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
కాకతీయ, హన్మకొండ : దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, నాణ్యత నియంత్రణలో లోపాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్సభలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన వస్తువులు సరైన ధరకే, ప్రమాణాలతో అందేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ధరల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలు న్యాయమైన ధరలకు విక్రయించబడుతున్నాయో లేదో కేంద్రం ఎలా పర్యవేక్షిస్తుందో వివరించాలని కోరారు. అలాగే వాణిజ్య దుకాణాల తనిఖీలు, నాణ్యత నియంత్రణ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు అడిగిన ప్రశ్నకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార – పొదుపు పంపిణీ శాఖ సహాయమంత్రి బి.ఎల్. వర్మ సమాధానమిస్తూ—దేశవ్యాప్తంగా 575 కేంద్రాల నుంచి రోజూ 38 కీలక ఆహార పదార్థాల ధరలను సేకరించి ప్రైస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా కేంద్రానికి అప్లోడ్ చేస్తున్నట్టు వివరించారు. దీంతో మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను సమయానికి గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 ప్రకారం ప్రతి న్యాయధరక దుకాణం ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పొందాలని గుర్తుచేశారు. పరిశుభ్రత, శానిటేషన్పై 2011లో రూపొందించిన నియమావళి ప్రకారం దుకాణాలు నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. ఉల్లంఘనలు జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రాంతీయ కార్యాలయాల సహకారంతో క్రమం తప్పకుండా తనిఖీలు, సర్వేలెన్స్, యాదృచ్ఛిక నమూనాల సేకరణ నిర్వహిస్తూ నాణ్యతను నిర్ధారిస్తోందని మంత్రి చెప్పారు. ప్రజలకు న్యాయమైన ధరలకే సరుకులు, నాణ్యమైన ఆహార పదార్థాలు అందాలంటే పర్యవేక్షణలో పారదర్శకత అవసరమని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. కేంద్రం స్పష్టమైన వ్యవస్థలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఎంపీ కోరారు.


