గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది మోదీ ప్రభుత్వమే
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి,సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర
కాకతీయ, కరీంనగర్ : దశాబ్దాల పాటు దేశం,రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామాలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి నెలకొన్నదని,2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల పట్ల నిజమైన స్పృహతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు.బుధవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన, 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలో ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. రోడ్లు, మురికి కాలువలు, వీధిదీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేకపోయిందని మండిపడ్డారు. గ్రామాల్లో మహిళల ఆత్మగౌరవం, వారి సమస్యలు కాంగ్రెస్ పాలనలో ఏమాత్రం ప్రాధాన్యం పొందలేదని అన్నారు.పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసే దిశలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అపార కృషి చేసిందని కళ్యాణ్ చంద్ర పేర్కొన్నారు. అంతర్గత రహదారులు, వీధిదీపాలు, సెంట్రల్ లైటింగ్, మురికి కాలువలు, డంపింగ్ యార్డులు, అంగన్వాడీ కేంద్రాలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు వంటి అనేక కీలక పనులు భారీగా పూర్తవ్వడం మోదీ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు.గ్రామాల్లో మహిళలు గౌరవంగా జీవించేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, కట్టెల పొయ్యిల బాధల నుంచి విముక్తి కల్పించిన ఉజ్వల గ్యాస్ యోజన వంటి పథకాలు గ్రామీణ కుటుంబాలకు దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. నేడు పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులను దయనీయ స్థితికి నెట్టివేసిందని ఆరోపించిన ఆయన, గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక అనేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి బీఆర్ఎస్ పాలనలోనే వచ్చిందని అన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు.రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సర్పంచులను అప్పుల బారిన పడేసిందని తెలిపారు. గ్రామాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా, ఇప్పుడు మాత్రం 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం తొందరపడి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులతో జరిగిన పనులకు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్రెడిట్ తమదేనని చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయడం దండగ అయిందని, గ్రామాల అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. మాయ మాటలకు మోసపోకుండా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమివ్వాలని పిలుపునిచ్చారు.కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు వేల కోట్లు మంజూరు చేయించారని కళ్యాణ్ చంద్ర తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.


