విశ్వనాధపురం గ్రామంలో ఏకగ్రీవంపై గ్రామస్తుల ఆగ్రహం
రూ.25 లక్షల ప్యాకేజీ ఆరోపణలు..
దండోరా వేస్తూ మరో విడత ఎన్నికల డిమాండ్
కాకతీయ, గీసుగొండ: విశ్వనాధపురం గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవంపై పెద్ద ఎత్తున వివాదం రేగింది. గ్రామ పెద్దల అనుమతి లేకుండా కొందరు బడా నాయకులు రూ.25 లక్షల ప్యాకేజీ డీల్ చేసి తమకిష్టమైన అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వర్గం నుండి పోటీకి దిగిన అభ్యర్థిని సర్పంచ్ పదవికి,బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీకి దిగిన సర్పంచ్ అభ్యర్థిని ఉప సర్పంచ్ ఇచ్చుటకు డీల్ చేసుకున్నట్లు వినికిడి. కాంగ్రెస్కు చెందిన రేవూరి వర్గ నేతలు,బీఆర్ఎస్కు చెందిన నాయకులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం.ఈ నేపథ్యంలో గ్రామస్తులు దండోరా వేయించి, ప్రతి వీధిలో తిరుగుతూ “మాకు ఈ ఏకగ్రీవం వద్దు… వెంటనే మరో ఎన్నికలు జరగాలి” అని బహిరంగ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఈ అంశంపై స్పందించక పోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇదిలా ఉండగా, సర్పంచ్ ఏకగ్రీవం తర్వాత వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేయాలని కొందరు నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు వినికిడి. గ్రామంలోని 9 వార్డుల్లో పోటీ కొనసాగుతు న్నప్పటికీ, “సర్పంచ్ ఏకగ్రీవమైందని మేము పోటీ నుంచి తప్పుకోవడం కుదరదు” అని ఓ వార్డు సభ్యుల అభ్యర్థి స్పష్టం చేశారు.ఈ పరిణామాలతో విశ్వనాధపురం గ్రామం ప్రస్తుతం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


