బీజేపీ ఆందోళన ఉద్రిక్తం
నాయకుల్ని ఈడ్చికెళ్లిన పోలీసులు
సమస్యలపై పోరాడితే అరెస్టులా
మంత్రికి కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
కాకతీయ, వరంగల్ సిటీ : అండర్ డ్రైనేజీ పనుల జాప్యంపై బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. గురువారం శివనగర్ వాటర్ ట్యాంక్ ప్రాంతంలో జరుగుతున్న అండర్ డ్రైనేజీ పనుల వద్ద బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యంపై, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళన విరమించాలని కోరగా అధికారులు వచ్చి పనుల పూర్తిపై హామీ ఇస్తేనే విరమిస్తామని పట్టుబట్టారు. భారత్ మాతాకీ జై.. అధికారులు నిర్లక్ష్యం నశించాలని నినాదాలు చేయడంతో బీజేపీ శ్రేణులను పోలీసులు బలవంతంగా ఈడ్చికెళ్లారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్తోపాటు ఇతర నాయకులను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నాయకులను బలవంతంగా పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం ఇరువైపులా నిలిచిపోయిన ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడితే దౌర్జన్యం చేయడమేకాక, అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో పోలీసు రాజ్యం సాగిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్కు పాలన చేతకాదని, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రోడ్లమీదకు వస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి, దౌర్జన్య కాండ కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. ఐదేళ్ల నుంచి నత్తనడకన సాగుతున్న శివనగర్ అండర్ డ్రైనేజీ పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని, ప్రజలు నరకయాతన పడుతున్నా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులు గత ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యం అవలంబిస్తోందని మండిపడ్డారు. స్థానిక మంత్రి కొండా సురేఖ కనీసం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. మంత్రికి కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ సమస్యల్ని పరిష్కరించడంలలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ పనుల జాప్యంతో నర్సంపేట నుంచి ఖమ్మం వెళ్లే రహదారిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. చిన్నపాటి వర్షం పడిందంటే చాలు శివనగర్ నీటమునిగి కాలనీవాసులు అనేక పాట్లు పడుతున్నారని వెల్లడించారు. సరైన దారిలేక తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాహనదారులు ఆస్పత్రి పాలవుతున్నారని వాపోయారు. అయినా మంత్రి సురేఖ ఒక్కసారైనా పనులను పరిశీలించిన దాఖలాలు లేవని ఆరోపించారు. సురేఖను ఓట్లేసి గెలిపిస్తే ఆమె గడీని దాటి రావడం లేదని విమర్శించారు. వరంగల్లో ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించిన దాఖలాలు లేవని, కనీసం వరంగల్ బస్టాండ్ను కూడా నిర్మించలేని దుస్థితిలో మంత్రి సురేఖ ఉండడం ఈ ప్రాంత దురదృష్టమన్నారు. మరోవైపు కేంద్రం భారీగా స్మార్ట్ సిటీ కింద నిధులు విడుదల చేసినా అభివృద్ధి పనులు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా శివనగర్ అండర్ డ్రైనేజీ పనుల్లో వేగం పెంచి త్వరలోనే పూర్తి చేయాలని లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గంట రవికుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్, గడల కుమార్, మాచర్ల దీన్ దయాళ్, జిల్లా నాయకులు బైరి శ్యామ్, ఆడేపు వెంకటేష్, మార్టిన్ లూథర్, బైరి నాగరాజు, మండల నాయకులు వైట్ల గణేష్, సూర శ్రీనివాస్, తమ్మిశెట్టి క్రాంతి, తాళ్ళపెల్లి శ్రీను, నవీన్, సురేందర్, మార్తా ఉష రాణి, సుజాత, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



