ఇద్దరు ఇంటర్ విద్యార్థుల సూసైడ్
బాచుపల్లి పీఎస్ పరిధిలో కలకలం
కళాశాలలో ఉరేసుకొని ఫస్టియర్ విద్యార్థిని..
ఉంట్లో ఉరేసుకొని సెకండియర్ విద్యార్థి బలవన్మరణం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న వీరు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల ఓ విద్యార్థిని కళాశాలలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్. అయితే.. ఈమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ప్రగతినగర్లో మరో విద్యార్థి..
మరో ఘటనలో బాచుపల్లి పీఎస్ పరిధి ప్రగతి నగర్లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉరివేసుకున్న అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శవపరీక్షల కోసం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.


