పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్..
పేరు మార్చుతూ కేంద్రం నిర్ణయం
కొత్త భవనంలోకి మారనున్న పాత కార్యాలయం
సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్ట్లో భాగంగా తుది దశకు నిర్మాణం
కాకతీయ, నేషనల్ డెస్క్ : ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) భవనం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. పీఎంవో భవనం పేరును సేవాతీర్థ్గా మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పీఎంవోను ఇక నుంచి సేవాతీర్థ్గా పిలవనున్నారు. ప్రధానమంత్రి దశాబ్దాలుగా సౌత్బ్లాక్లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండగా, ఆ కార్యాలయం కొత్త భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే పేరు మార్పుపై ప్రకటన వచ్చింది. సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్ట్లో భాగంగా నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇంతకుముందు ఈ భవనాలను ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్గా పిలిచేవారు. అయితే పరిపాలనలో సేవా భావం ప్రాముఖ్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సేవా తీర్థ్ అనే పేరు పెట్టాలని నిర్ణయించింది.
ఏఏ కార్యాలయాలు ?
కొత్తగా నిర్మించిన ఈ కాంప్లెక్స్లో పీఎంవోతోపాటు కేబినెట్ కార్యదర్శిత్వం, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ , ఇండియా హౌస్ ముఖ్యంగా ఉండనున్నాయి. ఇందులోని ఇండియా హౌస్ ప్రత్యేకంగా విదేశీ ప్రతినిధులు, ప్రపంచ నాయకులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపే కేంద్రంగా రూపొందుతోంది. దేశ విదేశాంగ వ్యవహారాల్లో ఇది కీలక పాత్ర పోషించనుంది. పరిపాలన అనేది కేవలం అధికారాన్ని ప్రదర్శించే స్థలం కాదు, ప్రజలకు సేవలందించే కేంద్రం కావాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. “సేవా తీర్థ్ అనేది సేవా భావాన్ని ప్రతిబింబించే పని ప్రదేశం. దేశ ప్రాధాన్యాలు, జాతీయ నీతులు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి” అని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలో ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన కానీ లోతైన మార్పు జరుగుతోందని వారు పేర్కొన్నారు. అధికారం నుంచి సేవాభావం వైపు, ఆధిపత్యం నుంచి బాధ్యత వైపు మార్పు జరుగుతోందని వెల్లడించారు.


