ఇప్పటికే బోలెడు నిధులు తెచ్చాం!
ఒక్కో డివిజన్ కు 50లక్షలు ఇస్తున్నాం..
పరిస్థితులకు అనుగుణంగా కొన్ని డివిజన్లకు ఎక్కువ!
వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.15వేలు
బల్దియా కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యే నాయిని వెల్లడి
త్వరలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తామని ప్రకటన
భద్రకాళి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వివరణ
కాకతీయ, వరంగల్ : గతంలో ఎన్నడు లేనంతగా గడిచిన రెండేళ్లలో వరంగల్ నగర అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పడంలో తడబడ్డారు. సోమవారం వరంగల్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అక్షయ పాత్ర ఆధ్వర్యంలో కొనసాగుతున్న రూ. 5భోజనానికి సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపారు. అనంతరం ఒక్కో డివిజన్ అభివృద్ధి కోసం రూ. 50లక్షలు కేటాయిస్తు నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వరద ముంపు బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.15వేలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో నగరాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
నిధుల వివరాల్లో తడబాటు..
అధిక మొత్తంలో తెచ్చిన నిధులు వివరాలు ఏమిటని విలేకరులు ప్రశ్నించగా ఎమ్మెల్యే నాయిని తడబడ్డారు. ఆ వివరాలు కచ్చితంగా తెలియదని, మరోసారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెబుతానని పేర్కొనడం గమనార్హం. ఒక్కో డివిజన్ కు రూ.50లక్షలు కేటాయించగా, హన్మకొండ ఎమ్మెల్యే పరిధిలోని కొన్ని డివిజన్లకు కోటికిపైగా నిధులు ఎలా కేటాయించారని ప్రశ్నించగా, అక్కడ కొన్ని అత్యవసర పనులు చేపట్టాల్సి ఉన్నందున ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భద్రకాళి చెరువు విస్తీర్ణం 360 ఎకరాల నుంచి 130 ఎకరాలకు ఎలా తగ్గిందని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. ఇక నగరంలో ముంపు నివారణ కోసం అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్ నిర్మిస్తామని, త్వరలో ఆ పనులు ప్రారంభిస్తామని నాయిని వెల్లడించారు.
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అసహనం
కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్ కోసం వచ్చిన ఆయన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైట్లు వస్తున్నారా? లేదా వారితో ముప్పు ఉందా అంటూ నిలదీశారు. కౌన్సిల్ సమావేశంలో చాకలి ఐలమ్మ భవనానికి నిధులు కేటాయించలేదని ఈ జెండా ప్రతులను చించి ఎగరేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశం అనంతరం కూడా ఆయన్ను మాట్లాడాలని విలేకరులు కోరగా, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దగ్గరుండి ఆయన్ను కారులో ఎక్కించి పంపించారు. దీంతో ఆయన్ను మాట్లాడకుండా చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది.
అబ్బనికుంట వాసుల నిరసన
కౌన్సిల్ సమావేశం వేళ అబ్బనికుంటవాసులు బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అబ్ద్బనికుంటలో రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా, అర్ధంతరంగా వదిలేయడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. పనులు వెంటనే ప్రారంభించి, పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాన గేటు వద్ద బైఠాయించిన మహిళలు, మధ్యాహ్నం 3గంటలకు కూడా సమావేశం ముగిశాక తమ నిరసనను వ్యక్తం చేశారు.


