ఏసిబి అధికారి వేషం వేసి దందా..
టాస్క్ ఫోర్స్ దాడిలో వరంగల్ లో ఐదుగురు అరెస్ట్..
నకిలీ ఎసిబి అధికారి అరెస్ట్ 20 ఏళ్ల నేర చరిత్ర బయట పడింది..
ఏసిబి పేరుతో బెదిరింపులు..
అధికారులు లక్ష్యంగా ముఠా దొరికింది..
ఘరానా మోసగాడు పట్టుబడ్డాడు.. 19 కేసులు, రూ. 50 లక్షల దోపిడీ..
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఏసిబి డీఎస్సీగా ముసుగు వేసుకుని ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ భారీ దోపిడీలకు పాల్పడుతున్న నకిలీ ఎసిబి అధికారి రాచంపల్లి శ్రీనివాస్తో పాటు అతనికి సహకరించిన నలుగురిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను (45 సం., పుట్టపర్తి జిల్లా, ఆంధ్రప్రదేశ్). అతనితో కలిసి నవీన్ జేఆర్ (కర్ణాటక), మంగళ రవీందర్ (బెంగుళూరు), మురళి (బెంగుళూరు), ఎస్.ఎన్. ప్రసన్న (బెంగుళూరు) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సూర్యప్రకాశ్, తాటిమద్ది వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న సీనియర్ అధికారులను టార్గెట్ చేసుకుని, మీ మీద అవినీతి కేసు నమోదైంది, బయటపడాలంటే డబ్బు ఇవ్వాలి అని ఏసిబి డీఎస్సీగా నటిస్తూ బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో వరంగల్ ఆర్ టి ఏ లో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డి నుంచి వివిధ మార్గాల్లో 10 లక్షల రూపాయలు దోచుకున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి, టెక్నికల్ సాక్ష్యాలను సేకరించి ఐదుగురిని అరెస్టు చేశారు. విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ నేర చరిత్ర 2002లో ద్విచక్ర వాహన దొంగతనాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత నకిలీ పోలీస్ అధికారిగా రాయలసీమలో నేరాలకు పాల్పడి, దొంగల కుటుంబాలను బెదిరించి బంగారం, డబ్బు దోచుకోవడం వంటి కేసుల్లో పాల్గొన్నాడు. మొత్తం 50కిపైగా కేసులు అతని పేరుతో నమోదయ్యాయి. జైలు శిక్షలు అనుభవించినా, బయటికి వచ్చిన తర్వాత మళ్లీ కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో 41 చైన్ స్నాచింగ్స్ కు పాల్పడ్డాడు. నకిలీ ఏసిబి డీఎస్సీగా మళ్లీ అవతారం ఎత్తిన తరువాత ఇప్పటివరకు 19 కేసులు, రూ. 50 లక్షలకు పైగా దోపిడీ చేశాడు. తెలంగాణలో 9 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 10 కేసులు నమోదయ్యాయి. అందులో 8 కేసుల్లో అరెస్టయ్యాడు, 11 కేసుల్లో పోలీసులకు అందకుండా తిరుగుతున్నాడు. దోచిన డబ్బును నిందితుడు ఆన్లైన్ బెట్టింగ్, గోవా కాసినోలు, బెంగుళూరు-గోవా వ్యభిచార గృహాల్లో ఖర్చు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ఈ నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఎసిపి ఎన్.శుభం ప్రకాష్, టాస్క్ ఫోర్స్ ఎసిపి ఎ. మధుసూదన్, ఇన్స్పెక్టర్లు ఎల్. పవన్ కుమార్, కె. శ్రీధర్, ఎల్. మంగిలాల్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బి. రమేష్, ఎస్ఐలు ఎస్. మహేష్, ఎం. సురేష్ లను పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు.



