బలుపుతోనే కేటీఆర్ మాటలు
గోకుడు, గీకుడుగాళ్లను వెంటేసుకుని తిరుగుతున్నడు
నా గురించి మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడు
36మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు విలువలు గుర్తు రాలేదా?
కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే కవిత బయటకు
హరీష్ రావు సైతం దూరంగా ఉంటున్నాడు
కేసీఆర్ లేని రోజు బీఆర్ఎస్ ముక్కలు చెక్కలు
కేటీఆర్కు సిగ్గు ఉంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలి
చెల్లెకు సమాధానం చెప్పలేని దద్దమ్మ, సన్నాసి కేటీఆర్
మాజీమంత్రి కేటీఆర్పై ఎమ్మెల్యే కడియం ఫైర్
కాకతీయ, వరంగల్ బ్యూరో : అహంకారం, బలుపుతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరని, దాన్ని ప్రజలు హర్షించరని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ సభ్యత సంస్కారం మరిచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కేటీఆర్ లాగా అయ్య పేరు చెప్పుకొని, కుటుంబం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదని అన్నారు. తాను స్వంతంగా ఎదిగిన నాయకున్ని అని స్పష్టం చేశారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎక్కడ ఉండే వాడో అయన ఊహకే వదిలేస్తున్నాని అన్నాడు.
కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు…!
కడియం శ్రీహరి 100శాతం దమ్మున్న నాయకుడని అన్నారు. నీతి, విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదని తెలిపారు. 10ఏళ్లలో 36మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని అందులో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నీతి విలువలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గీకుడుగాళ్లను, గోకుడుగాళ్ళను, తాగుబోతులను వెంటేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బలుపుతో, అహంకారంతో మాట్లాడితే ప్రజలు హర్షించరని అన్నారు. తెల్లారి లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాల పైన ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. రాజకీయాలలో అందరూ లక్ష్యం తోనే పని చేస్తారని, కానీ మంచి నాయకుడిగా ఎదగాలంటే అహంకారం, బలుపు తగ్గించుకొని సభ్యత సంస్కారం తో మాట్లాడాలని సూచించారు.
చెల్లికి సమాధానం చెప్పలేని సన్నాసి కేటీఆర్
కేటీఆర్ నాయకత్వంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే కవిత వెళ్లిందనని అన్నారు. కేటీఆర్ కు సిగ్గు ఉంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెల్లికి సమాధానం చెప్పలేని దద్దమ్మ, సన్యాసి కేటీఆర్ అని విమర్శించారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయి కాబట్టే కవిత ఆ విధంగా ఆరోపణలు చేస్తుందని తెలిపారు. ముందు నీ చెల్లికి సమాధానం చెప్పి కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు.
కేసీఆర్ లేని రోజు బీఆర్ఎస్ ముక్కలు
కేటీఆర్ నాయకత్వం నచ్చకనే హరీష్ రావు దూరంగా ఉంటున్నాడని కడియం అన్నారు. హరీష్ రావు కేసీఆర్ ఉన్నాడు కాబట్టే ఆగుతున్నాడని, కేసీఆర్ తర్వాత ఆయన దారి అయన చూసుకుంటాడని తెలిపారు. కేసీఆర్ ఉన్నంత వరకే బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ తర్వాత ముక్కలు చెక్కలు అవుతుందని జోస్యం చెప్పారు. కేటీఆర్ పై ఇప్పటికే 10కేసులు ఉన్నాయని, అయన ఎప్పుడైనా జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడి రాజకీయం చేసి, స్కాములు చేసి కేటీఆర్ అడ్డగోలుగా దోచుకున్నాడని ఆరోపించారు.
42శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ సంకల్పం
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విధానం, సంకల్పం అని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రంపై తేవాల్సిన బీఆర్ఎస్, బీజేపీ లు రాష్ట్రంలో అసత్య ప్రచారాలు, కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేకుండా కేసులకు భయపడుతున్నాడని ఆరోపించారు. బీజేపీకి బీసీలపైన ప్రేమ ఉంటే వేంటేనే 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని అనడం సరైంది కాదని తెలిపారు. కేంద్రం మాత్రమే చేయగలదని తెలిసి కూడా ధర్నాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


