అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్
వివిధ దేశాల ప్రతినిధులు, అంబాసిడర్లు హాజరు
ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి
అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం
భారత్ స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల పరిశీలన
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం, ఈ సమ్మిట్కు సంబంధించి పలు విషయాలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఈ సమ్మిట్ను నిర్వహించాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు, అంబాసిడర్లు ఈ సమ్మిట్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
పాస్లు లేకుంటే నో ఎంట్రీ..
పాస్లు లేకుండా ఎవరు ఎంట్రీ కావడానికి వీలు లేదని, సమ్మిట్కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందని వెల్లడించారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పారు. బందో బస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమ్మిట్కు హాజరయ్యే మీడియాకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించనుంది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుండి సుమారు రెండు వేల మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయిలో తన విజన్, పాలసీలను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ ఒక ముఖ్య వేదికగా కానుందని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది


