మేడారం జాతర పనులను యజ్ఞంలా చేపట్టాలి- మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి: మేడారం జాతర పనులను యజ్ఞంలా చేపట్టాలని, గిరిజన సంప్రదాయాలను ఉట్టి పడేలా ఏర్పాట్లు ఉండాలని, నాణ్యతా ప్రమా ణాలు పాటించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, ఐ టి డి ఏ పి ఓ చిత్ర మిశ్రా లతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం దేవాలయం అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఐటిడిఏ గెస్ట్ హౌస్ లో మంత్రి సీతక్క, కలెక్టర్, పి.ఓ. తో కలిసి నేషనల్ హైవే, ఆర్ అండ్ బి, పి. ఆర్., ట్రైబల్ వెల్ఫేర్, ఆర్టీసీ, ఆర్ డబ్ల్యూ ఎస్, ఇర్రిగేషన్, విద్యుత్, టూరిజం, ఫారెస్ట్, వైద్య శాఖ అధికారులతో మేడారం జాతర పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.అంతకుముందు మేడారం లోని గిరిజన మ్యూజియం, మిషన్ భగీరథ ఓ హెచ్ ఆర్ ఎస్ వాటర్ ట్యాంకులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మల్లంపల్లి, కటాక్షపూర్ జాతీయ రహదారి మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.


మంగపేట బస్టాండ్ నిర్మాణ పనులు డిసెంబర్ 20 లోగా పూర్తి చేయాలని అన్నారు. మహాజాతరకు ముందు వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్న క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని అన్నారు. మహా జాతరను విజవంతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. శ్రీ సమ్మక్క- సారలమ్మల కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తం గా తెలిసే విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పని చేయాలని అన్నారు. అదనపు లేబర్, యంత్రాలు, నిపుణులను సమకూర్చుకొని నిర్ణీత సమయానికి పనులన్నీ పూర్తి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఏపిఓ వసంతరావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



