అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా గురుకులం నిర్మాణం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్స్ చార్జిల పెంపు
కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ
మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పటిష్ట కార్యాచరణ
వైరాలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణానికి,
33/11 కెవి సబ్ స్టేషన్ల, రోడ్డు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా గురుకులాలను నిర్మిస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖామాత్యులు మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, టీజీ ఎన్పీడీసీఎల్ ఎండి కర్నాటి వరుణ్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ లతో కలిసి వైరాలో సుమారు 20 ఎకరాల స్థలంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణ పనులకు, వైరా నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో 18 కోట్ల 46 లక్షలతో చేపట్టిన ఏడు 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు, 58 కోట్ల 50 లక్షలతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సి.ఎం. మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ* గేమ్ చేంజర్ గా యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం నిలుస్తుందని అన్నారు. ప్రపంచ స్థాయి పోటీని ధీటుగా ఎదుర్కొనేలా మన విద్యార్థులను తయారు చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా గురుకులాలు నిర్మిస్తున్నామని అన్నారు.
ప్రతి యంగ్ ఇండియా స్కూల్ కు 20 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, సకల సదుపాయాలతో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉండేలా, విద్యా బోధన చేసే స్టాఫ్, ఇతర సిబ్బంది క్వార్టర్స్ సైతం అక్కడే నిర్మిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాలలో ప్రోత్సాహం అందించేలా చర్యలు చేపట్టామని అన్నారు.
యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణానికి సంబంధించి 30 కోట్ల నిధులను కలెక్టర్ ఖాతాకు ఇప్పటికే విడుదల చేసామని, పనుల వేగం ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించుకొని బిల్లులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.
గత 10 సంవత్సరాల కాలంలో అనేక ధరలు పెరిగిన డైట్ చార్జీలు, కాస్మోటిక్స్ చార్జిలను పెంచలేదని, పిల్లలు పోషకాహార లోపంతో అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని, దీనిని గమనించిన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్స్ చార్జిలను పెంచడం జరిగిందని అన్నారు. గురుకులాల్లో పిల్లలకు మంచి ఆహారం పెట్టాలని లక్ష్యంతో నిష్ణాతులైన వైద్యులచే కామన్ డైట్ మెనూ తయారు చేసి పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు. గురుకులాలను జిల్లా ఉన్నతాధికారులు రెగ్యులర్ గా తనిఖీ చేస్తూ చిన్న, చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు.
ప్రపంచానికి దశ, దిశ నిర్దేశించి స్థాయికి మన విద్యార్థులు ఎదిగేందుకు అవసరమైన ఏర్పాట్లను యంగ్ ఇండియా గురుకులాల్లో కల్పిస్తున్నామని అన్నారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, మహిళలు కట్టుకునే విధంగా నాణ్యమైన చీరలు అందిస్తున్నామని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథకం క్రింద వడ్డీ లేని రుణాలు అందించామని, గత టిఆర్ఎస్ హాయంలో వడ్డీ లేని రుణాలు పథకం నిర్వీర్యం చేసిందని తెలిపారు. 5 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలు మహిళలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పటివరకు 27 వేల కోట్ల వడ్డి లేని రుణాలు అందించామని అన్నారు.
పెట్రోల్ పంపు, సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీకి అద్దె బస్సుల ఏర్పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటు వంటి అనేక వ్యాపార అవకాశాలను మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మహిళల చేతిలో డబ్బులు ఉంటే కుటుంబ వ్యవస్థ బాగుపడుతుందని తమ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందని అన్నారు. 53 లక్షల నిరుపేద కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు.
వైరా నియోజకవర్గ పరిధిలో 52 వేల 19 కుటుంబాలు ఉచిత విద్యుత్ లబ్ది పొందాయని, ప్రజల తరపున 36 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. మహిళలు ఎక్కడికైనా ప్రయాణం చేసేలా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు.
వైరా లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. వైరా రిజర్వాయర్ కాలువల లైనింగ్ పనులు జరుగుతున్నాయని, ఏ.టి.సి. ను సైతం మంజూరు చేసామని త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. గిరిజన రైతుల కోసం ఇందిరా గిరి జల వికాసం క్రింద 5 వేల బోర్లను వేయడం జరిగిందని అన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ శాఖ పరిధిలో గణనీయంగా విద్యుత్ డిమాండ్ పెరిగినా ఎటువంటి కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని అన్నారు. వైరా నియోజకవర్గ పరిధిలో ఏడు 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులు 18 కోట్ల 46 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. రాబోయే వేసవి కాలంలో కూడా ఎటువంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణం భవనం, రోడ్డు అభివృద్ధి పనులు, 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణా లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం చేపట్టామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఇది ఉపయోగ పడుతుందని అన్నారు.

యంగ్ ఇండియా సమీకృత గురుకులం నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలలో ఎటువంటి రాజీ లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు నిర్మాణ పనులు పర్యవేక్షించాలని అన్నారు. గురుకులం నిర్మాణ పనులకు అనుసంధానంగా అవసరమైన త్రాగునీటి, విద్యుత్ సరఫరా, ఇతర ఇన్ ఫ్రా పనులు చేపట్టామని అన్నారు.
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదటి విడత గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం ప్రారంభించిందని, 18 సంవత్స రాలు నిండిన ప్రతి మహిళకు చీర అందుతుందని కలెక్టర్ తెలిపారు.
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ* వైరా అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల కాలంలో 500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని అన్నారు. సీతారామ కాలువల నుంచి వైరా ప్రాజెక్టుకు నీరు తరలించేందుకు రాజీవ్ లింక్ కెనాల్ నిర్మించామని, వైరా ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల మరమ్మత్తు కోసం నిధులు మంజూరు చేశారని, 200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులం నిర్మిస్తున్నామని అన్నారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసి,1456 స్వయం సహాయక సంఘ సభ్యులకు 153 కోట్ల 60 లక్షల బ్యాంకు లింకేజ్ రుణాలు చెక్ ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, హస్త కళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డిసిసిబి డైరెక్టర్ బొర్రా రాజశేఖర్, డిఆర్డీవో సన్యాసయ్య, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకొబ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రామారావు, డిసి హెచ్ఎస్ డా. రాజశేఖర్, డిఇఓ చైతన్య జైని, డిఐఇఓ రవిబాబు, వివిధ శాఖల అధికారులు, మహిళలు, ఏపీఎంలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



