అక్రమ పట్టా రద్దు చేయాలి
పేదలకు పట్టాలు ఇవ్వాలి
కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర నాగారం రెవెన్యూ శివారు సర్వే నం. 109/ఏ/ఈలోని 40 ఎకరాల ప్రభుత్వ భూమిని పుల్యాల వసంత పేరుతో అక్రమంగా పట్టా మంజూరు చేయడంపై సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేసి, భూమిలో నివసిస్తున్న నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ములుగు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం భూమిగా ఉన్న ఈ 40 ఎకరాల్లో 30 ఎకరాలపై చిన్న సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారని, మిగిలిన 10 ఎకరాల్లో 570 మంది పేదలు ఐదేళ్లుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని తెలిపారు. ఈ భూమికి పుల్యాల వసంతకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆమె భర్త కృష్ణారెడ్డి లాయర్ ప్రభావాన్ని వినియోగించి దొంగ పత్రాలు సృష్టించి అక్రమంగా పట్టా తీసుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి భూమి ప్రభుత్వదేనని స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గత ఇన్చార్జి కలెక్టర్, ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య కూడా ఇదే నిర్ణయాన్ని వెలువరించారని చెప్పారు. ఈ భూమిపై కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందన్నారు. పేదలను, రైతులను బెదిరించి, చట్టాలను ఉల్లంఘించి భూమిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూమిపై నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ భూమి కోసం సిపిఎం ఎన్నో సార్లు పోరాటాలు చేసినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అక్రమ పట్టాను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పొదిల్ల చిట్టిబాబు, తీగల ఆగిరెడ్డి, గొంది రాజేష్, రత్నం ప్రవీణ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కలవల రవీందర్తో పాటు మండల కమిటీ సభ్యులు కడారి నాగరాజు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, శాఖ కార్యదర్శి శ్రీరామోజు సువర్ణ, చిన్నపెళ్లి అశోక్, తిప్పర్తి సరళ, కోయిల సులోచన, మన్సోజు బ్రహ్మచారి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


