స్మార్ట్ సిటీపై అధికారులు ఇష్టారాజ్యం
మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్
మహాత్మా జ్యోతిబాపులే పార్క్ భూమి విద్యుత్ శాఖకు కేటాయింపుపై ఆగ్రహం
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కరీంనగర్ను స్మార్ట్ సిటీగా మారుస్తూ నగర అభివృద్ధికి చేపట్టిన పనులను ఇప్పుడు అధికారులు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గతంలో ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబాపులే పార్క్ను ఏర్పాటు చేసి స్మార్ట్ సిటీ బోర్డుకు అప్పగించామని, కానీ ఇప్పుడు అదే పార్క్లోని 4 గుంటల భూమిని విద్యుత్ శాఖకు కేటాయించడం నగర అభివృద్ధి ఆత్మను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు సేకరించకుండానే పార్క్ భూమిని మరో శాఖకు కేటాయించడం స్పష్టమైన నిబంధనల ఉల్లంఘన అని అన్నారు. చట్టంలో ఎక్కడా కూడా పార్క్లలోని భూములను ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం లేదని, స్మార్ట్ సిటీ కింద ఉన్న భూములను కేవలం అభివృద్ధి కార్యక్రమాల కోసమే వినియోగించాలనే నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. పార్క్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా భవిష్యత్తులో అనుకోని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లాలోని పలు పార్క్ స్థలాలను కమ్యూనిటీ హాళ్లు, యూత్ క్లబ్బులుగా మార్చడం కూడా అదే ధోరణిలో జరుగుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా జారీ చేసిన సర్కులర్పై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కౌన్సిల్ లేకుండా, ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా ప్రతి ఇంటి నుంచి నెలకు 60 రూపాయల చొప్పున వసూలు చేయడం ప్రజలపై భారీ భారం మోపటమేనని అన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా ఇండ్లు ఉండగా నెలకు 60 లక్షలకుపైగా వసూళ్లు జరుగుతున్నాయని, ఇది ప్రజాపాలన పేరుతో జరుగు ఇష్టానుసార పాలనకే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రజలు పన్నులు చెల్లిస్తుండగా శానిటైజేషన్ పేరుతో మళ్లీ కొత్తగా వసూళ్లు ప్రారంభించడం అర్థరహితమని ప్రశ్నించారు. కాంట్రాక్టు వ్యవస్థ కొనసాగుతున్నప్పటికీ జ్యోతిబాపులే పార్క్ 4 గుంటల భూమిని ఎలా కేటాయించగలిగారు అని ప్రశ్నించిన ఆయన వెంటనే ఆ జీఓను రద్దు చేయాలని, శానిటైజేషన్ పేరుతో జరుగుతున్న వసూళ్లను నిలిపేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించి, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ నగర మేధావులు, బుద్ధిజీవులు కూడా ఈ అంశంపై స్పందించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.


