తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్లవు
కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవు
గతంలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ మొన్న ఎలా అధికారంలోకి వచ్చింది?
కార్యకర్తలారా అధైర్యపడకండి
ఓడిపోగానే కుంగిపోవద్దు, భవిష్యత్తు మనదే
బరిగీసి కొట్లాడితే తప్ప విజయం సాధించలేం
ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హిందూవులే లక్ష్యంగా బండి సంజయ్ ప్రచారం
ఆయన్ను ఉద్దేశించే ఈటల కామెంట్స్ అంటూ ప్రచారం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమనచెప్పకొచ్చారు. గెలిచినా, ఓడినా.. అధికారం ఉన్న.. లేకపోయినా దశాబ్దాలుగా కాషాయ జండా పట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ వచ్చిన తరువాత 9 ఉప ఎన్నికలు జరిగితే 7 సార్లు అధికార పార్టీనే గెలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలిచింది… అని ఈటల అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ హిందూవులే లక్ష్యంగా బండి సంజయ్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అక్కడ బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది. తాజాగా మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని ఈటల కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఈవీఎం మేనేజ్ చేసిందా ?
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టి మరీ గెలిచిది. గతంలో కేసీఆర్ ఎన్ని చేశారో వీరు కూడా అవే చేశారు. కాంగ్రెస్ కి హుజురాబాద్ లో వచ్చిన ఓట్లు 3016, దుబ్బాక, మునుగోడులో డిపాజిట్ కోల్పోయింది. మరి డిపాజిటు కోల్పోయిన పార్టీ మొన్న ఎలా అధికారంలోకి వచ్చింది. ఒక్క బై ఎలక్షన్ ఓడిపోగానే బీజేపీ పని అయిపోతుందా? రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరూ అలా మాట్లాడరు. బీహార్ ఎన్నికలు ఒక ప్రభంజనం. ఒళ్ళు వంచి పని చేస్తే విజయం మనదే.
కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి బాధపడకండి. భవిష్యత్తు మనదే. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం అంతా బాధ్యత తీసుకుంటున్నాం. ప్రజలకు సేవ చేయడం వల్లనే దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. గెలిస్తే బీజేపీ వాళ్ళు ఈవీఎంలను ఏదో చేశారని అంటు న్నారు. మరి జూబ్లీహిల్స్ లో ఈవీఎం మేనేజ్ చేశారా? దొంగఓట్లు నమోదు చేయించారా? తెలంగాణలో, కర్ణాటకలో కూడా మీరే గెలిచారు. మరి అక్కడ కూడా అలానే చేశారా ? మీరు గెలిస్తే ఒక న్యాయం.. మేము గెలిస్తే ఓట్ చోరీ అని అంటారా ? ఏం చేస్తావో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. ఇలాంటి ఆరోపణలు కాదు.
బరిగీసి కొట్లాడే తత్వం లేనప్పుడు పార్టీ ముందుకు పోయే అవకాశం లేదు..అని ఈటల వ్యాఖ్యానించారు.
అభివృద్దితోనే ..
ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేశావు, ఇక ముందు ఏం చేస్తావు? అని చెప్పి ప్రజలను ఓట్లు అడగాలి. కులం మతం పునాదిమీద రాజకీయాలు శాశ్వతంగా నడవవు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మాది ప్రజాస్వామిక పార్టీ అందుకే గుజరాత్ లో ఇన్నేళ్లుగా పాలన నడుస్తుంది. అభివృద్ధితో పాటు భారత ఆత్మగౌరవం నిలబెట్టడం వల్లనే బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారు. మోడీ నాయకత్వంలో దేశం అగ్రభాగాన నిలబడింది. యాభై శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న నియోజకవర్గంలో 25 ఏళ్ల మైథిలీ ఠాగూర్ విజయం సాధించింది అంటే అర్థం చేసుకోండి. అభివృద్ధి సంక్షేమం అందరికీ అందుతుంది తప్ప ఒక వర్గానికి కాదు… అని ఈటల రాజేందర్ అన్నారు.


