ఇష్టారాజ్యంగా ఇంటర్ కళాశాల నిర్వహణ
లక్షల్లో ఫీజులు.. లక్షణంగా నిర్లక్ష్యం
ఐఐటీ, మెడికల్ అకాడమీల పేర్లతో దోపిడీ
మచ్చుకైన కనబడని ల్యాబులు, ప్లే గ్రౌండ్ లు
ఫైర్ సేఫ్టీ, పి ఈ టి, మెడికల్ ఎక్విప్మెంట్స్ కు మంగళం
అనుమతులు లేకుండానే అకాడమీల నిర్వహణ
అకాడమిక్ సంబంధం లేకుండా క్లాసుల నిర్వహణ
అర్హతలు లేని లెక్చర్లల్లోతో క్లాసుల నిర్వహణ
ఖమ్మంలో నిద్ర అవస్థలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీల నిర్వహణ జరుగుతోంది. లక్షల్లో ఫీజులను సైతం వసూళ్లు చేస్తూ పేద,మధ్యతరగతి ప్రజానీకాన్ని దోచుకుంటున్నాయి. కాలేజీల నిర్వహణ పేరుతో విద్యార్థులకు తల్లిదండ్రులకు టోకరా వేస్తు తమ కాలేజీల్లో ఉన్నతమైన చదువుల అందిస్తామని మాయమాటలు చెప్తు అందిన కాడికి దండుకుంటున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ నిర్వహణ జరపాలంటే ప్రతి కాలేజీలో ప్లే గ్రౌండ్, ల్యాబ్, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, పీఈటి, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలకు సంబంధించిన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవేమీ పట్టనట్లుగా కాలేజ్ నిర్వాహకులు వ్యవహరించడంపై పలు అనుమానాలు బాధిత తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
క్వాలిటీ విద్య పేరుతో అధిక ఫీజులు
ప్రైవేట్ కళాశాలలో క్వాలిటీ విద్య పేరుతో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేయడం జరుగుతోంది. విద్యా ప్రమాణాల్లో గాని, నిబంధనలు కాని ఎక్కడా పాటించకపోవడం గమనార్హం. సంబంధిత శాఖ అధికారులు మామూళ్ల మత్తులో తూగడం వల్ల కళాశాలల యజమానులు చేసే చేష్టలకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. ఐఐటీ, మెడికల్ అకాడమీ ల పేర్లతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశచూపి కార్పొరేట్ స్థాయి కాలేజీలకు దీటుగా నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడపుతున్నారు. ప్రధానంగా ఖమ్మం నగరంలో నడుపుతున్న ప్రైవేట్ అకాడమీ సెంటర్లకు వేటికి కూడా అనుమతులు లేవన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కోచింగ్ సెంటర్లకు పలు కాలేజీల విద్యార్థులకు కోచింగులు ఇప్పించి అవి తమ కాలేజీల పేరిట వచ్చిన ర్యాంకులుగా చెప్పుకుంటూ జిమ్మిక్కులకు పాల్పడుతున్నాయి. ఈ విషయం గతంలోనూ పలు కాలేజీల విషయంలో బయటపడటం గమనార్హం. ఏ కాలేజీలో కూడా అనుభవం ఉన్న ఉపాధ్యాయుల కంటే అనుభవం లేనివారే ఎక్కువగా ఉంటున్నారు. క్వాలిటీ విద్యా అందిస్తామంటూ విద్యార్థులను చదువుపేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని కాలేజీల్లో ఈ వ్యవహారం మరింతగా మితిమీరడంతో ఒత్తిళ్లు తట్టుకోలేని విద్యార్థులు ఆత్మహత్య శరణ్యముగా భావించి మృత్యువు ఒడిలోకి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి.
తుంగలో నిబంధనలు..
విద్యార్థుల ద్వారా వచ్చిన సొమ్ముతో ప్రతి కాలేజీ యాజమాన్యం అందమైన భవల అంతస్తుల్లో కాలేజీల నిర్వహణ అంటూ నిబంధనలు తుంగలో తొక్కుతూ విద్యార్థులను మూడు నాలుగు అంతస్తులు మెట్లు ఎక్కిస్తూ నరకం చూపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక పరీక్షల సమయంలో తమ ర్యాంకుల పరపతి కోసం విద్యార్థులపై లేనిపోని బారాలు మోపుతున్నట్లు తెలుస్తోంది. ఏ కాలేజీ కూడా ప్లే గ్రౌండ్ లేకపోవడం కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామంటూ ఒత్తిళ్లకు గురిచేయడం సరికాదని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిద్రావస్థలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉండడం వల్లనే ఇదంతా జరుగుతుందని ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ కాలేజీల నుంచి ప్రతి ఏటా అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు మూడుతున్నాయని దీనివల్లే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఎన్ని తప్పులు చేసినా అవి ఒప్పులుగా మారుతున్నాయని తెలుస్తుంది.


