ఎన్డీఏదే బీహార్
పనిచేసిన ‘నిమో’ (నితీష్+మోదీ) ఫార్ములా
ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు
మహాఘట్ బంధన్ కు 37.9 శాతం
మహాఘట్ బంధన్ పై దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యం
ఎన్నికలపై మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ పథకం
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
కాకతీయ, నేషనల్ డెస్క్ : బీహార్ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. ఎన్డీయే కూటమి దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్ బంధన్ మీద పైచేయి సాధించినట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయ్యింది. నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళా రోజ్గార్ యోజన పథకం కింద కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ భారీ మెజారిటీ సాధించడానికి దోహదపడింది. ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు, మహాఘట్ బంధన్ కు 37.9 శాతం, నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది
సర్వే వివరాలు ఇలా…
పీపుల్స్ పల్స్ – ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ‘ప్లస్ ఆర్ మైనస్’ ఉండే అవకాశాలు ఉంటాయి
– 243 స్థానాలు ఉన్న బీహార్ శాసనసభలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్డీయే కూటమికి 133-159 స్థానాలు, మహాఘట్ బంధన్ కూటమికి 75-101 స్థానాలు, ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, నూతనంగా ప్రారంభించిన జన్ సురాజ్ పార్టీకి 0-5 స్థానాలు వచ్చే అవకాశం ఉంది
ఎన్డీయే కూటమిలోని బీజేపీ 63-70, జేడీయూ 55-62, ఎల్జేపీ (ఆర్వీ) 12-17, హామ్ 2-5, ఆర్ఎల్ఎం 1-4 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మహాగట్ బంధన్ లోని ఆర్జేడీ 62-69, కాంగ్రెస్ 9-18, సీపీఐ(ఎంఎల్) 4-9 గెలిచే అవకాశాలున్నాయి. నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 0-5 స్థానాలు, ఏఐఎంఐఎం పార్టీ 0-2, సీపీఐఎంకి 0-3, వీఐపీకి 0-5, సీపీఐ 0-2, ఇతరులు 2-8 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. బీజేపీకి 21.4 శాతం, ఆర్జేడీకి 23.3 శాతం, జేడీయూకి 17.6 శాతం, జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, కాంగ్రెస్ పార్టీకి 8.7 శాతం, ఎల్జేపీకి 5 శాతం, ఇతరులకు 7.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది
ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు… తేజశ్వీ యాదవ్ కి 32 శాతం మంది, నితీశ్ కుమార్ కి 30 శాతం, ప్రశాంత్ కిషోర్ కి 8 శాతం, చిరాగ్ పాశ్వాన్ కి 8 శాతం, సామ్రాట్ చౌదరికి 6 శాతం, రాజేశ్ కుమార్ కి 2 శాతం మద్దతిచ్చారు. అగ్రవర్ణాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈబీసీ వర్గాల మద్దతులో ఎన్డీయే ఆధిక్యంలో ఉండగా… ముస్లిం, బుద్ధిస్టులు, ఓబీసీ సామాజిక వర్గాల్లో అధికశాతం మంది మహాఘట్ బంధన్ వైపు ఉన్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది. 66.8 శాతం మహిళలు ఎన్డీయేకి మద్దతిస్తుండగా, మహాఘట్ బంధన్ కు కేవలం 24.8 శాతం ఓటర్లు మాత్రమే మద్దతిస్తున్నారు. – బ్రాహ్మణ, కుశ్వ, పాశ్వాన్, రాజ్ పుత్, కుర్మి, చమార్, భూమియార్, మల్లా, తేలి, బనియా, కాను, నోనియా సామాజిక వర్గాల్లో ఎన్డీయేకు ఆధిక్యత లభిస్తుంది. మహాఘట్ బంధన్ కేవలం యాదవ్, ముస్లిం, ఓబీసీల్లోని కొన్ని వర్గాల్లో మాత్రమే కొంత ఆధిక్యత కనబరుస్తోంది.
‘నిమో’ (నితీష్+మోదీ) ఫార్ములా
దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడంలో అధికార ఎన్డీఏ కూటమికి ‘నిమో’ (నితీష్+మోదీ) ఫార్ములా దోహదపడింది. – జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి ఉన్న జనాకర్షణ, రాష్ట్రంలో నీతిష్ కుమార్ పై ఉన్న ప్రజాదరణ బీహార్ లో ఏన్డీఏ గెలుపుకు అనుకూలంగా మారాయి. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో జేడీ (యూ), టీడీపీలపై ఆధారపడిన నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏకి కీలకంగా మారాయి. జాతీయ రాజకీయాల నేపథ్యంలో బీహార్ లో నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయానికి నరేంద్ర మోదీ సహా బీజేపీ జాతీయ నాయకులు క్రియాశీలకంగా పనిచేశారు. బీహారీలను ఆకర్షించడంలో నితీష్ కుమార్ వంటి జనాకర్షణ కలిగిన పెద్ద నాయకుడు తమ పార్టీలో లేకపోవడంతో బీజేపీ ఆయనపైనే ఆధారపడాల్సి వచ్చింది. నితీష్ కుమార్ 75 ఏళ్ల వయసులోనూ బీహార్ లో ఎన్డీఏకు ట్రంప్ కార్డుగా ఉన్నారు. నితీష్ కుమార్ క్లీన్ చీట్ ఇమేజీ ఎన్డీఏకు బలంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అభివృద్ధిని పట్టించుకోలేదని, అవినీతికి పాల్పడ్డారనే వ్యతిరేకత ఉన్నా ‘నిమో’ ఫార్ములా ఎన్డీఏకు అనుకూలించింది. వరుసగా 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నా…. నితీష్ కుమార్ ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని నిలబడడానికి ప్రధాన కారణం ఆయనకు మహిళల ఆశీర్వాదమే.
ఎన్డీఏ పథకాల హామీల ప్రభావం..!
– మహిళా ఓటర్లను ఆకర్షించడం నితీష్ కు ఇది మొదటి సారి కాదు. 2007లో పాఠశాలలకు వెళ్లే బాలికలందరికీ ఉచితంగా సైకిళ్ల పంపిణీ, 2016లో మద్యపాన నిషేధం వంటి చర్యలతో మహిళా ఓటర్లను ఆకర్షించిన నితీష్ కుమార్ ఇప్పుడు ఆర్థిక భారమైనా రూ.10 వేల నగదు బదిలీ పథకంతో విజయవంతం అయ్యారు. మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ లో 2020 ఎన్నికల్లో ఉన్న ఉత్సాహం 2025 ఎన్నికల్లో కనిపించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నిరుద్యోగం, వలసలు అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకున్నా 2020లో ఆయనకు యువతలో ఉన్న క్రేజీ ఇప్పుడు తగ్గింది. నిరుద్యోగం, వలసలపై యువతలో అసంతృప్తి కనిపించినా అది పూర్తిగా తేజస్వీ యాదవ్ కు అనుకూలంగా మారలేదు. ప్రశాంత్ కుమార్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ, బీజేపీ కూడా యువత ఓట్లను ఆకర్షించాయి. మహాఘట్ బంధన్ కూటమికి ముస్లిం, యాదవ్ సామాజికవర్గాల్లో ఉన్న మద్దతుతో ఇప్పటికే 33 శాతం బలం స్థిరంగా ఉన్నా, దాన్ని 40 శాతానికిపైగా దాటించడమే తేజస్వీ యాదవ్ కు ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు తేజస్వీ యాదవ్ కు తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ పై ఉన్న ‘జంగల్ రాజ్’ అభియోగం పెద్ద గుదిబండగా మారింది. లాలు ప్రసాద్ యాదవ్ పరిపాలనలో యాదవ్ సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని ఇప్పటికీ దళితులు, అగ్రవర్ణాలు మరవకపోవడం తేజస్వీ యాదవ్ కు ప్రతికూలంగా మారుతోంది. మహాఘట్ బంధన్ నిరుద్యోగం, వలసలను ప్రచార అస్త్రాలుగా చేసుకుంటే, ఎన్డీఏ ‘జంగల్ రాజ్’తో పాటు అభివృద్ధిపై ప్రచారం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తేజస్వీ యాదవ్ పై కంటే ఎక్కువగా లాలు ప్రసాద్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తూ ‘జంగల్ రాజ్’ ను ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీకి వనరులు అధికంగా ఉండడం కూడా ఎన్డీఏకు అనుకూలంగా మారింది. డిజిటల్ ప్రచారంలో అన్ని పార్టీలు చేసిన ఖర్చులను కలిపినా ఒక్క బీజేపీ చేసిన ఖర్చు కంటే తక్కువే.
ప్రజలను ఆకర్షించడంలో కాంగ్రెస్ విఫలం..!
– మహాఘట్ బంధన్ కూటమిలో ప్రధాన భూమిక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వలే ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యారు. ఆయన ‘ఓట్ చోరీ’ నినాదం బీహార్ లో ఓట్లను రాల్చలేకపోయింది. దళితుల్లో మహాఘట్ బంధన్ పై కొంత సానుభూతి కనిపించినా దాన్ని ఓట్లగా మల్చడంలో ఆ కూటమి విఫలమైంది. 2020 ఎన్నికల్లో 5 వేల కంటే తక్కువ మెజార్టీ వచ్చిన స్థానాలు 50కి పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో తక్కువ మెజార్టీ స్థానాల్లో దళితులు కీలకంగా మారుతున్నారు. కొత్త పార్టీ జన్ సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ యువతను ఆకర్షించడంలో విజయవంతం అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు చెప్పుకోదగ్గ సీట్లు రాకపోయినా భవిష్యత్ లో బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పార్టీగా జన్ సురాజ్ ఎదగడం ఖాయం.
పోటాపోటీగా సాగిన 2020 అసెంబ్లీ ఎన్నికలకు ప్రస్తుతం జరుగుతున్న 2025 ఎన్నికలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దళితులలో ఆదరణ ఉన్న ఎల్జీపీ 2020లో విడిగా పోటీ చేయగా ఆ పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. ఈ రెండు కూటముల్లోని పార్టీలను పోలిస్తే మహాఘట్ బంధన్ కంటే ఎన్డీఏ బలంగా కనిపిస్తోంది.


