గోపీనాథ్ ఆస్తులపై సీఎం.. కేటీఆర్ మధ్య గొడవలు
ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య తేడాలొచ్చాయి
గోపీనాథ్ మరణం వెనుక మిస్టరీ ఉందని ఆయన తల్లే చెబుతోంది
అయినా విచారణ జరపకపోవడానికి కారణం ఇదే..
సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాల్సిందే
జూబ్లీహిల్స్లో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కమార్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కమార్ సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కన్నేశారని చెప్పారు. ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య ఇటీవల గొడవలు వచ్చాయన్నారు. గోపీనాథ్ మరణం మిస్టరీ అని స్వయానా ఆయన తల్లే ఆరోపించిందన్నారు. అయినా దీనిపై ముఖ్యమంత్రిసహా కాంగ్రెస్ నేతలెవరూ స్పందించకపోవడానికి కారణం ఇదేనని చెప్పారు. సీఎంకు నిజంగా చిత్తుశుద్ధి ఉంటే గోపీనాథ్ మరణంతోపాటు ఆస్తిపాస్తులపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
కూడబలుక్కునే ఒకరికొకరు తిట్టుకుంటున్నారు
జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కొమ్ముకాస్తున్నారు…సిగ్గు చేటు. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. కూడబలుక్కునే ఒకరికొకరు తిట్టుకుంటున్నారు. మేం ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారు. ఈరోజు మీనాక్షిపురం(రహమత్ నగర్)లో సాయంత్రం సభకు పర్మిషన్ ఇవ్వాలని ఈనెల 4న దరఖాస్తు చేసుకున్నాం. నిన్నటిదాకా దీనిపై స్పందించలేదు. కానీ పొద్దున ఫోన్ చేసి అనుమతి ఇవ్వడం లేదని, వేరేచోట పెట్టుకోవాలని చెబుతున్నారు. మేం ఎక్కడ సభ పెట్టుకోవాలో కూడా వాళ్లే మాకు చెబుతున్నరంటే ఏమనాలి?. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం ఎక్కడ అడిగితే అక్కడ మీటింగ్ కు అనుమతి ఇస్తున్నారు. చివరి నిమిషంలో ఎక్కడైనా అనుమతి ఇచ్చినా కండీషన్లు పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు డీజేలు పెట్టుకోవడానికి, హంగామా చేయడానికి మాత్రం అనుమతి ఇస్తారు. ఇదేం ద్వంద్వ వైఖరి?. బీజేపీ సభలకు అనుమతిస్తే… ఒక వర్గం ఓట్లు రావనే భయం కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు పట్టుకుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది. జూబ్లిహిల్స్ లో బీజేపీ గెలవకూడదనే కుట్రతోనే మా సభలకు అనుమతి ఇవ్వడం లేదు. దొంగ సర్వేల పేరుతో బీజేపీ పోటీలో లేదంటూ
తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.. అంటూ సంజయ్ మండిపడ్డారు.
గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు
ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలిసే కాంగ్రెస్ పార్టీ ముస్లింల మెప్పు పొందేందుకు యత్నిస్తోంది. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఐఎంసీ(ఇండియన్ ముస్లిం కాంగ్రెస్) మధ్యే పోటీ. భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యే పోటీ. కాంగ్రెస్ కు ముస్లిం ఓట్లు కోసం మాత్రమే యత్నిస్తోంది. హిందువులంతా తమ సత్తా ఏమిటో కాంగ్రెస్ కు రుచి చెప్పాలని కోరుతున్నా. బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందే చేతులెత్తేసింది. జూబ్లిహిల్స్ ప్రజలారా… అభివ్రుద్ధి కావాలా? అరాచక కావాలా? తేల్చుకోండి. కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ గెలిచినట్లే…అరాచకాలు, అక్రమాలకు తావిచ్చినట్లే. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని చెబుతున్నారు. దేశ జవాన్లను అవమానించేలా, హేళన చేసేలా మాట్లాడారు. మాగంటి గోపీనాథ్ మరణం విషయంలో ఆయన తల్లిని మానసిక క్షోభకు గురి చేశారు. కన్న కొడుకును కూడా కొడుకు గోపీనాథ్ ముఖం చూడనీయకుండా చేయడంపై అనేక అనుమానాలున్నయి. నా కొడుకు మరణం ఒక మిస్టరీ అని స్వయానా గోపీనాథ్ తల్లే చెబుతోంది. అసలు గోపీనాథ్ చనిపోయింది ఎప్పుడు? ముందే చనిపోయారని చెబుతున్నారు…. అని సంజయ్ అన్నారు.
విచారణ జరపాలి..
గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరపాలి. గోపీనాథ్ కుటుంబ సభ్యులు, ఆసుపత్రి యాజమాన్యం స్టేట్ మెంట్లను రికార్డు చేయాలి. తన తండ్రిని చూడటానికి రావొద్దంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించినట్లు గోపీనాథ్ కొడుకే ఆరోపించారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు… స్పందించడం లేదు. ఎందుకంటే గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ట్విట్టర్ టిల్లు మధ్య పంపకాల యవ్వారం ఉంది. అందుకే కేసీఆర్ కుటుంబంపై ఉన్న కేసులపై విచారణ జరగడం లేదు… అరెస్టు చేయడం లేదు. గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో కేటీఆర్, రేవంత్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీటికోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయి. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లద్దరూ పంచుకున్నారు. దమ్ముంటే గోపీనాథ్ ఆస్తులెన్ని? అవన్నీ ఎటుపోయాయో చెప్పే దమ్ముందా?గోపీనాథ్ మరణం, ఆస్తుల వ్యవహారంపై విచారణ జరిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?. గోపీనాథ్ మరణంపై స్వయానా తల్లి ఆరోపణలపై ఇంతవరకు కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు?.
ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయి
సీఎంకు నిజంగా సంబంధం లేదని భావిస్తే… తక్షణమే గోపీనాథ్ మరణం, ఆస్తిపాస్తులపై సమగ్ర విచారణ జరిపించాలి. గోపీనాథ్ మరణం వెనుక ఏం జరిగిందో.. ఆయన ఎప్పుడు చనిపోయారు? ఎవరికి ఆలస్యంగా చనిపోయినట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన చేసిందో విచారణ జరపాల్సిందే. ఎక్కడైనా ఆస్తుల పంపకాలపై కుటుంబ సభ్యులు కొట్లాడుకోవడం చూశాం. ఇక్కడ మాత్రం గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్, ట్విట్టర్ టిల్లు కొట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులకు, బీఆర్ఎస్ క్యాడర్ కు కూడా అనేక అనుమానాలున్నాయి. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో గోపీనాథ్ అనుచరులెవరూ ప్రచారం కూడా చేయడం లేదు. ప్రజలకు వాస్తవాలు అర్ధమయ్యాయి. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ గెలుపు తథ్యం. సర్వే నివేదికల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు ప్రజలకు అర్ధమయ్యాయి. హర్యానా ఎన్నికలుసహా అనేక ఎన్నికల్లో బీజేపీ ఓ. డిపోతుందని సర్వేలు ప్రచారం చేశాయి. ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే… చైన్ స్నాచర్లకు, గంజాయి విక్రేతలకు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారబోతోంది… అని సంజయ్ అన్నారు.


