భూమి లేనివారికి 72 గజాల స్థలం.. ఇళ్లు
భూమిలేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం
రైతులకు మేలు చేసేందుకే భూభారతి చట్టం
మహబూబాబాద్ జిల్లాకు రూ.3.16 కోట్ల లబ్ధి
సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్
రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కాకతీయ, మరిపెడ : పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చుట్టంలాంటి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి వారి సమస్యలకు పరిష్కారం చూపుతోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూమిలేని పట్టణ ప్రజలకు 72 గజాల విస్తీర్ణంతో ఇళ్లను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అర్హులైన రైతులకు మంజూరైన సబ్సిడీ వ్యవసాయ యంత్రాలను మంత్రి, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే , డాక్టర్ జాటోతు రామచంద్రు నాయక్తో కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
కోట్ల రూపాయల లబ్ధి..!
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రూ.3.16 కోట్ల విలువైన రైతు పనిముట్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అర్హులైన రైతులందరికీ ఈ యంత్రాలను అందజేస్తామని చెప్పారు. రైతుల ఆదాయం పెంపుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని కోరుకున్నారని, రైతుల కష్టాలు ప్రజా ప్రభుత్వంతోనే తీరుతాయని స్పష్టమైందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. రైతులకు గుదిబండగా మారిన ధరణిని బంగాళాఖాతంలో వేసి, భూభారతి వంటి చట్టాన్ని తీసుకొచ్చి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.
సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సన్నాలు పండించిన రైతులందరికీ క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. నిరుపేదల సుభిక్షం కోసం సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, వడ్డీ లేని రుణాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొమ్ము యుగంధర్ రెడ్డి, యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి, మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ నళ్ళు సుధాకర్ రెడ్డి, అధికారులు ఏడీఏ విజయచంద్ర, మండల వ్యవసాయ అధికారి బోడ వీరాసింగ్, తాసిల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ విజయానంద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


