హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు
చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోనే ఆక్రమణలు
కోర్టు కేసులున్నా నిర్మాణాలు
ప్రగతినగర్ స్మశానవాటికను కాపాడాలంటూ విన్నపాలు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రజావసరాలకు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు సమర్పించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధుల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్లో ప్రజావసరాల కోసం కేటాయించిన సుమారు 5 ఎకరాల శ్మశానవాటిక స్థలం కబ్జాకు గురవుతోందని స్థానిక నివాసితులు ఆరోపించారు. ఆలేటి శ్రీనివాసరావు, జశ్వంత్ తదితరులు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూ, శ్మశానవాటికకు ఆనుకుని ఉన్న దాదాపు 4 ఎకరాల చెత్త డంపింగ్ యార్డు ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణలోకి వెళ్లిందని పేర్కొన్నారు. సర్వే అధికారులు దీనిని నిర్ధారించారని, హైడ్రా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బాచుపల్లి పెద్దకుంట… ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలు
బాచుపల్లి పెద్దకుంట చెరువు ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలో శ్మశాన వాటిక నిర్మాణం కొనసాగుతోందని శిఖర రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ నిర్మాణాలు ఆగడం లేదని ఆరోపించింది. శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలోని పోచమ్మ దేవాలయానికి చెందిన భూమిలో అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారని స్థానికులు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో పనులు తాత్కాలికంగా ఆగాయని, అయితే విషయం కోర్టులో ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణ యత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అమీన్పూర్లో పోచమ్మకుంటలో కూడా ఇదే పరిస్థితి
అమీన్పూర్ సర్వే నంబర్ 971లోని పోచమ్మకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో స్మశానవాటిక నిర్మాణం జరుగుతోందని మరో ఫిర్యాదు అందింది. చెరువుల పరిరక్షణకు హైడ్రా కఠిన చర్యలు తీసుకోవాలని నివాసితులు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ ఎస్బీఆర్ కాలనీలో 25 అడుగుల రహదారిని సుమారు 5 అడుగుల మేర ఆక్రమించి షాపులు నిర్మించారని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో అంబులెన్స్లు, పాఠశాల బస్సులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఆక్రమణలో నిర్మించిన షట్టర్లు తొలగించాలని డిమాండ్ చేశారు.
హైడ్రా స్పందన
హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్య ఫిర్యాదులను పరిశీలించి, సమస్యల పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్రజావసరాల భూములు, చెరువుల ఎఫ్టీఎల్ పరిధి, రహదారుల పరిరక్షణపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఈ 42 ఫిర్యాదులు నగర పరిసర ప్రాంతాల్లో భూఆక్రమణలు ఎంత తీవ్రమైన స్థాయిలో ఉన్నాయో స్పష్టంచేస్తున్నాయి.


