39 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
మూడు ప్రాంతాల్లో తనిఖీలు.. 6ఏ కేసులు నమోదు
కాకతీయ, ఖమ్మం : అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లపై సివిల్ సప్లయ్ అధికారులు దాడులు నిర్వహించి మొత్తం 39 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. రఘునాథపాలెం మీసేవా కేంద్రంలో తనిఖీ సందర్భంగా అక్రమంగా నిల్వ చేసిన 32 సిలిండర్లను స్వాధీనం చేసుకుని, మీసేవా ఆపరేటర్ జంగాల దుర్గారావుపై అవశ్యక వస్తువుల చట్టం కింద 6ఏ కేసు నమోదు చేశారు. ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లోని భవాని బిర్యాని హోటల్లో తనిఖీ చేసి, గృహ వినియోగ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వినియోగించినందుకు 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే రఘునాథపాలెంలోని సితారా హోటల్లో తనిఖీ చేసి అక్రమంగా నిల్వ చేసిన 4 సిలిండర్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సివిల్ సప్లయ్ అధికారులు గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలను గమనించిన ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.


