*టోల్ హైవే… టోటల్ డ్యామేజ్….
*గుంతల మయంగా మారిన నేషనల్ హైవే….
*రిపేర్లకు నోచుకోని ఎన్ హెచ్163
*టోల్ బాదుడు మాత్రం బరాబర్…
*అధికారుల తీరుపై వాహనదారుల ఆగ్రహం…
కాకతీయ, ములుగు ప్రతినిధి: ఒకవైపు ములుగు జిల్లా పర్యాటకపరంగా దూసుకు వెళ్తుంటే మరోపక్క జిల్లాలో ప్రధాన రహదారిగా ఉన్న జాతీయ రహదారి 163 గుంతల మయంగా మారి వచ్చిపోయే పర్యాటకులను వెక్కిరిస్తుంది. జాతీయ రహదారి పై టోల్ పేరుతో వాహనదారుల నుండి టోల్ చార్జీలు వసూలు చేస్తున్న అధికారులు హైవే పరమత్తుకు మాత్రం పైసా విధిల్చడం లేదు. ములుగు జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారి 163 పై ములుగు గట్టమ్మ నుండి ఏటూర్ నాగారం వరకు 2020లో నిర్మించిన 60 కిలోమీటర్ల జాతీయ రహదారి పై నేషనల్ హైవే అధికారులు చిన్నచూపు చూస్తున్నారని, వాహనదారుల నుండి టోల్ చార్జీలు వసూళ్లపై ఉన్న శ్రద్ధ హైవే మరమ్మత్తుల పైన లేకపోవడంతో జాతీయ రహదారి భారీ గుంటలతో దర్శనమిస్తుందని, వర్షాకాలం కొట్టుకుపోయిన రోడ్లతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిష్కారం దిశగా ముందడుగు పడకపోవటంపై జిల్లా వాసులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ములుగు టు పస్రా గుంతల మయం…
2020లో నిర్మాణం పూర్తి చేసుకున్న హైవేలో ములుగు నుండి వస్రా వరకు 25 కిలోమీటర్ల రహదారి పూర్తిగా గుంతల మయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న మరమ్మతులు చేయడం లేదని, జాతీయ రహదారి 163 నుండి నిత్యం వేలాది వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల హైవేపై ఏర్పడిన గుంతలతో నిత్యం ప్రమాదాలు చేసుకుంటున్నాయని, ముఖ్యంగా వర్షాకాలం లో రహదారిపై లోతైన గుంతలలో నీరు నిలిచి ప్రమాదాలకు కారణం అవుతున్న హైవేకి మరమ్మతులు చేసి ప్రమాదాలను నివారించే ప్రయత్నం చేయటం లేదని, ఇసుక లారీల వల్ల ఏర్పడిన భారీ గాడులను సైతం సరి చేయకుండా వదిలేయడం వల్ల కార్లు, ద్విచక్ర వాహనదారులు కుదుపులకు లోనే ప్రమాదం బారిన పడుతున్నారని, ఇంత జరుగుతున్నా హైవే అధికారులు మరమ్మతులకు పూనుకోకపోవడంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు.
వర్షాకాలంలో జాతీయ రహదారికి తప్పని వరదలు…
ములుగు నుండి ఏటూరునాగారం వరకు 60 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై వాహనదారుల నుండి టోల్ రూపంలో చార్జీలు వసూలు చేస్తున్న రోడ్డును మాత్రం ప్రయాణానికి అనుకూలంగా మార్చడం లేదని, వర్షాకాలం వచ్చిందంటే జాతీయ రహదారిపై నుండి వరదలు వెళ్తూ ప్రయాణాలకు అవరోధాలు ఏర్పడుతున్న వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించే ప్రయత్నాలు చేయడం లేదని, పస్రా నుండి ఏటూరునాగారం మధ్యలో వర్షాల వల్ల మొండ్యాల తోగు, జలగలంచా వాగులు హైవే పై నుండి ప్రయాణిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు శాశ్వత పరిష్కారంగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మించకపోవడం అధికారుల అలసత్వానికి ప్రతికలుగా నిలుస్తున్నాయని జిల్లా వాసులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.

టోల్ వసూళ్లలో తగ్గేదే లేదు…
జాతీయ రహదారి 163 పై ములుగు నుండి ఏటూరునాగారం వరకు 60 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ప్రయాణానికి టోల్ వసూలు చేసేందుకుగాను గోవిందరావుపేట మండలం జవహర్ నగర్ వద్ద టోల్గేట్ ఏర్పాటు చేసి రహదారి గుండా వచ్చి పోయే వాహనాలకు కార్లకు 40, బస్సులకు 155, లారీలకు 245 రూపాయల చొప్పున టోల్ చార్జీలు వసూలు చేస్తున్న అధికారులు టోల్గేట్ వద్ద కనీస ప్రమాణాలు పాటించడం లేదని, టోల్గేట్ వద్ద మంచినీటి వసతి, టోయింగ్ వెహికల్ అందుబాటులో ఉంచకపోవడం,10 సెకండ్ల నియమాన్ని పాటించకుండా సిబ్బంది వాహనాల నుండి టోల్ వసూలు చేస్తున్నారని, ఇదేంటని అడిగితే టోల్ సిబ్బంది దుర్భాషలాడుతున్నారని వాహనదారులు వాపోతున్నారు.

కనిపించని హైవే నిర్వహణ….
గుంతల మయంగా మారిన జాతీయ రహదారిని మరమ్మత్తు చేయకుండా వాహనదారుల నుండి టోల్ వసూలు చేయడం ఏంటని, మూడు సంవత్సరాలుగా జాతీయ రహదారిపై గుంతలు, గాడులు ఉన్న కనీసం ప్రమాద హెచ్చరికలు, తాత్కాలిక మరమ్మత్తులు చేయకపోవడం, ముఖ్యంగా ములుగు జిల్లా కేంద్రంలోని హైవేపై గుంతలు ఉన్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై జిల్లా ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. టోల్ వసూలు చేసినంత శ్రద్ధ హైవే మరమ్మత్తులపై పెడితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

త్వరగా హైవేను పునరుద్ధరించాలి-ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్.
ములుగు జిల్లాలో జాతీయ రహదారి 163 పూర్తిగా ధ్వంసమైన హైవే అధికారులు పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారు. కేంద్రం హైవేలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు వెచ్చిస్తుంటే అధికారులు వాటిని వినియోగించడంలో విఫలమవుతున్నారు. వెంటనే జాతీయ రహదారికి మరమ్మత్తులు పూర్తిచేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలి.
హైవే మరమ్మతులు పూర్తయ్యే వరకు టోల్ వసూలు నిలిపివేయాలి- బిఆర్ఎస్ ములుగు మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి.
ములుగు నుండి పస్రా వరకు జాతీయ రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడ్డ టోల్ చార్జీల పేరుతో వాహనదారుల నుండి టోల్ వసూలు చేయడం విడ్డూరం. జాతీయ రహదారి మరమ్మత్తు పూర్తయ్య వరకు టోల్డ్ చార్జీలను నిలిపివేయాలి. వెంటనే జాతీయ రహదారికి మరమ్మత్తులు పూర్తిచేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలి.

హైవే మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం – నేషనల్ హైవే డి ఈ కుమారస్వామి.
జాతీయ రహదారి 163 ను మరమ్మత్తులు చేసేందుకు గాను అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి మా ఉన్నతాధికారులకు పంపించాము. హైవే మరమ్మత్తులకు ఆమోదం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. వర్షాకాలం పూర్తయిన వెంటనే మరమ్మత్తులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం.


