20 మంది మావోయిస్టులు మృతి
దద్దరిల్లిన దండకారణ్యం
బీజాపూర్లో మరోసారి భారీ ఎదురుకాల్పులు
మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎన్కౌంటర్
నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా రెండు రోజులుగా ఆపరేషన్
మృతుల్లో పీఎల్జీఏ 2 కమాండర్ వెల్ల మోడియం ?
మావోయిస్టుల మృతదేహాలతోపాటు
పెద్దఎత్తున ఆయుధ, పేలుడు సామగ్రి స్వాధీనం
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కొనసాగుతున్న ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బుధవారం ప్రారంభమైన భారీస్థాయి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని పోలీసులు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 19 మంది మావోయిస్టులు ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. భద్రతా దళాలకూ భారీ నష్టం సంభవించింది. ముగ్గురు డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) జవాన్లు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు పెద్దఎత్తున ఆయుధ, పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
పార్టీకి కోలుకోలేని దెబ్బ
మరోవైపు ఈ సంవత్సరంలోనే మావోయిస్టు పార్టీ ఛీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్తోపాటు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా లాంటివారు మృతి చెందడం అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగిపోవడం చంద్రన్న, బండి ప్రకాశ్ అనారోగ్య కారణాలతో సాయుధమార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడం లాంటి ఘటనలు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారాయి. దీంతో నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన మావోయిస్టు (అప్పటి పీపుల్స్ వార్) ఉద్యమం నేడు తీవ్ర ఒడిదొడుకులకు గురవుతోంది. ఆపరేష్ కగార్ నేపథ్యంలో వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతోంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అనేకమంది పార్టీ అగ్రనేతలే ఉద్యమాన్ని వీడుతున్నారు. దండకారణ్యంలో మనలేని పరిస్థితుల్లో ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. పార్టీలో కీలకంగా ఉన్న మరికొందరు సైతం ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలను రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమంలో పురోగమించే అవకాశం లేదని గ్రహించిన నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
జనవరి 1న ఒకేసారి లొంగిపోతామని లేఖ
కొద్ది రోజుల క్రితమే మావోయిస్టులు ఊహించని విధంగా కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ జోన్ ప్రతినిధి అనంత్ అనే పేరుతో వారు ఓ లేఖను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు కాకుండా అంతా ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలైన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగుబాటు, గెరిల్లా వ్యూహకర్త హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ మరింత బలహీనమైందని పేర్కొన్నారు. మిగతావారు కూడా లొంగిపోవాలన్న కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ లేఖలో వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించి, భద్రతాబలగాల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని మావోలు కోరారు. జోన్లో ఎలాంటి అరెస్టులు కానీ ఎన్కౌంటర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని వారు తమ లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరగడం.. 19 మంది మావోయిస్టులు మరణించడం గమనార్హం.


