రాష్ట్రంలో కుల గణనతో దేశ వ్యాప్త చర్చ
మోదీ కాంగ్రెస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తున్నారు
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అఖిలపక్షంతో కృషి
రాజకీయ పార్టీలు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీకి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

కాకతీయ, హైదరాబాద్ : కులగనన సర్వే అవసరం లేదన్న మోదీని జన గణనతో పాటు కుల గణన కూడా చేయిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా, విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేకి ముందు సర్వేకి తర్వాత అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే చారిత్రాత్మకమైనదన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. మంగళవారం భట్టి విక్రమార్క సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ బిల్లును త్వరితగతిన పార్లమెంట్లో ప్రవేశపెట్టి మద్దతు కూడగట్టడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం .. ఈ కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు కూడా కలిసి వస్తారన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కుల గణన చేపడుతామని మా నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ప్రకటించారు ఆ మేరకు విజయవంతంగా కుల గణన పూర్తి చేసి క్యాబినెట్లో, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింప చేశామని అన్నారు. కుల గణన లో తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుంది, దేశంలోని ఏ రాష్ట్రం అయినా కుల గణన చేపట్టాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసరించాల్సిందేనన్నారు. గతంలో దేశంలో చేపట్టిన వివిధ రకాల సర్వేలు, వారి అనుభవాలు పరిగణలోకి తీసుకున్నాం, సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి తయారీ విధానం, జిల్లా, రాష్ట్రస్థాయిలో భాగస్వాములు అందర్నీ సర్వేకు ముందే సమావేశపరిచి వారి అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్లామన్నారు. ప్రతి 150 ఇళ్లకు ఒక బ్లాక్, ప్రతి బ్లాక్ కు ఒక అధికారిని నియమించాం. పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో సర్వే జరిగిందన్నారు. సమాచారం సేకరించిన విధానం, సేకరించిన డాటాను క్యాబినెట్లో, అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేశాం, ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే వివరాలను స్వతంత్ర అనుభవజ్ఞుల కమిటీతో కలిసి విశ్లేషణ చేయించామన్నారు. పారదర్శకంగా, పకడ్బందీగా సర్వే పూర్తి చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేకు అసెంబ్లీలోనే బిజెపి, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారు, అదేవిధంగా పార్లమెంట్ లోను పార్టీలకు అతీతంగా బీసీ బిల్లుకు మద్దతు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుందన్నారు. 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ను తొలగించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని ఆర్డినెన్స్ తీసుకు వచ్చాం.. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారని ఆశిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు దళితులు బీసీలు, మైనార్టీలు అంటే చిన్న చూపు ఉందన్నారు. దేశంలో ఈ వర్గాలకు మేలు జరుగుతుంటే ఆయన పదేపదే అడ్డుపడుతున్నారు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రామచంద్ర రావు గారి పాత్ర ఏంటో అందరికీ తెలుసు .. రిజర్వేషన్ల బిల్లు మేమే తెచ్చాం మేమే పరిష్కరించుకోవాలని బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారన్నారు. వారు విషయాన్ని సరిగా అవగాహన చేసుకోలేదని భావిస్తున్నాను అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అనేది కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంశం.. రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదని అన్నారు.
భట్టి విక్రమార్క లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తి కాదు..
భట్టి విక్రమార్క లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తి కాదు.. సమయం వచ్చినప్పుడు పార్టీగా, వ్యక్తిగా లీగల్ నోటిస్ కు ఎలా సమాధానం చెప్పాలో ఆ విధంగా చెబుతానని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఈ పద్ధతిలో కుల గణన జరగలేదు.. తెలంగాణ చేపట్టిన కుల గణన దేశానికి దిశా నిర్దేశం చేసిందన్నారు. కుల గణనకు సంబంధించి కేంద్రం ఏ సమాచారం అడిగిన ఎప్పుడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కుల గణన విషయంలో అన్ని రకాల పరిణామాలను ఎదుర్కొనేందుకు ఒక పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది.. పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాయి.. పార్లమెంట్లో అందుకు భిన్నంగా ఆయా పార్టీలు స్పందిస్తాయని అనుకోవడం లేదన్నారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు అన్ని గాలికి వదిలేశారు.. మాకు నిబద్ధత ఉంది కాబట్టి ప్రణాళికా ప్రకారం ముందుకు వెళుతున్నామని అన్నారు. కార్పొరేషన్ల చైర్మన్ ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుంది.


