కాకతీయ, కరీంనగర్ బ్యూరో: నిపుణులు తయారుచేసిన సిలబస్ తో, శిక్షణ పొందిన అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రైవేటుకు ధీటుగా బోధిస్తున్నారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ భవనంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ శుక్రవారం సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పోషణ, ఆరోగ్యం తదితర విషయాల పట్ల అవగాహన వస్తోందని అన్నారు. మహిళ తనతో పాటు తన పిల్లల పోషణ ఎలా ఉందో తెలుసుకో గలుగుతోందని అన్నారు. సృజనాత్మకతతో అంగన్వాడీ టీచర్లు విభిన్నమైన ఆట వస్తువులను తయారు చేసి చిన్నారులకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ నేర్పుతారని అన్నారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలతో ప్రైవేట్ పాఠశాలల నుంచి సైతం ప్రభుత్వ పాఠశాలలకు అడ్మిషన్లు వచ్చాయని, సుమారు 8 వేల అడ్మిషన్లు పెంచామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బీపీ షుగర్ వంటి అన్ని వ్యాధులకు పరీక్షలతో పాటు గోలీలు ఉచితంగా ఇస్తారని తెలిపారు. నెల నెల మందులు వాడేవారు ఆరోగ్య సిబ్బందికి తెలియజేస్తే ఇంటి వద్దకే మాత్రలు అందజేస్తారని అన్నారు.
గ్రామంలోని ప్రతి మహిళ ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడిలో బోధనకు వినియోగించే ఆట వస్తువులు, ప్రీస్కూల్ కిట్లతో నిర్వహించిన ప్రీస్కూల్ మేళా ఆకట్టుకుంది. చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిత, తహసిల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో రాజేశ్వరి, సీడీపీఓ నర్సింగారాణి, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ సుధారాణి, ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్ పాల్గొన్నారు.


