రేషన్ డీలర్ల బియ్యం దందా
లబ్ధిదారుల నుంచే నేరుగా కొనుగోళ్లు
గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్గా గోదాంలకు తరలింపు
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు
నిబంధనలను బేఖాతర్ చేస్తున్న డీలర్లు
డీలర్లే బియ్యం దందాకు కీలక సూత్రధారులుగా అనుమానాలు
డీలర్లపై కనిపించని తనిఖీలు
మామూల్ల మత్తులో సంబంధిత శాఖ అధికారులు.
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పేదల కడుపు నింపాల్సిన సన్నబియ్యం ఇప్పుడు కొందరు రేషన్ డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్ సన్నబియ్యం డీలర్ల అక్రమార్జనకు నెలనెల ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన వ్యాపారంగా మారింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ కొనుగోళ్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా డీలర్లు మాత్రం నిబంధనలను బేఖాతర్ చేస్తూ దందాను నిర్భయంగా కొనసాగిస్తున్నారు. పంపిణీ చేయాల్సిన డీలర్లే ఒక చేత్తో పంపిణీ చేస్తూ మరో చేత్తో కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్ గోదాంలకు తరలించి అక్కడి నుంచి ఇతర మార్గాల ద్వారా బహిరంగ మార్కెట్కు మళ్లిస్తూ భారీ లాభాలు కొల్లగొడుతున్నారు. ఈ అక్రమ దందాలో నెలకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అటువంటి ఘటననే తాజాగా కాకతీయ నిఘా నేత్రానికి చిక్కింది.
అక్కడే ఇస్తాడు..అక్కడే కొంటాడు
కరీంనగర్ నగరంలోని భగత్నగర్ ఓల్డ్ 33, న్యూ 42వ డివిజన్ పరిధిలోని రేషన్ షాపులో అక్రమ వ్యవహారం వెలుగుచూసింది. సన్నబియ్యం పంపిణీ చేయాల్సిన రేషన్ డీలరే ఒకవైపు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తూనే మరోవైపు అదే షాపులో లబ్ధిదారుల నుంచే తిరిగి కొనుగోలు చేస్తున్నాడు. కిలోకు రూ.12 చొప్పున నగదు నేరుగా లబ్ధిదారుల చేతికి అందజేస్తున్న దృశ్యాలను కాకతీయ నిఘా నేత్రం క్లిక్మనిపించింది. ఈ డీలర్ ప్రతి నెల రేషన్ బియ్యం పంపిణీ సమయంలో ఇదే విధానాన్ని కొనసాగిస్తూ లబ్ధిదారుల వద్ద నుంచి యథేచ్ఛగా బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన బియ్యాన్ని తనకు సంబంధించిన వ్యక్తి ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ద్విచక్ర వాహనంపై రహస్యంగా తరలించి వేరే ప్రాంతంలోని ఒక స్థావరంలో నిల్వ ఉంచుతూ అనుకూల సమయం చూసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు స్థానికుల నుంచి తెలుస్తున్న గోప్య సమాచారం. ఈ విషయంపై కాకతీయ సంబంధిత అధికారులను సంప్రదించగా ఈ ఘటనపై చర్యలు చేపడతామని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు!
భగత్నగర్కే పరిమితం కాకుండా కరీంనగర్ జిల్లా అంతటా అనేక రేషన్ షాపుల్లో బియ్యం దందా బహిరంగంగానే కొనసాగుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పేదలకు పంపిణీ చేసిన సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్లకు చేరకముందే తిరిగి డీలర్ల చేతుల్లోకి చేరి వారికి భారీ లాభాలను తెచ్చిపెడుతున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని తిరిగి కొనుగోలు చేయడం పూర్తిగా నిషిద్ధమన్న విషయం తెలిసినా నిబంధనలను తుంగలో తొక్కుతూ డీలర్లు దర్జాగా వ్యాపారం కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లబ్ధిదారులను ప్రలోభపెట్టడం, ధర ఖరారు చేయడం, రహస్యంగా తరలించడం వరకు మొత్తం వ్యవహారం డీలర్ల చేతుల్లోనే సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంపిణీ బాధ్యత ఉన్నవారే ఈ అక్రమాలకు ప్రధాన పాత్రధారులుగా కొనసాగుతుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ దందాకు ప్రధాన కారణంగా అధికారుల తనిఖీలు కొరవడటం, స్టాక్ వెరిఫికేషన్ సరిగా జరగకపోవడమేనన్న కోణం ముందుకు వస్తోంది. పర్యవేక్షణ సడలడంతో డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈ అక్రమ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ముడుపుల మౌనమే డీలర్లకు అండ..?
రేషన్ షాపుల్లో డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు మౌనంగా ఉండటంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీలర్లు నిర్భయంగా అక్రమ దందా కొనసాగించడానికి కారణం శాఖలవారీగా నెలవారీ ముడుపులు అందుతుండటమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవడం, తనిఖీలు కనిపించకపోవడం, స్టాక్ వెరిఫికేషన్ కాగితాలకే పరిమితమవడం అన్నీ కలిసి డీలర్లకు రక్షణ కవచంగా మారుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మేల్కొని అక్రమ దందాను కొనసాగిస్తున్న డీలర్లపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


