విధిలో మానవత్వం…
డాక్టర్ రాజశేఖర్ గౌడ్కు సెల్యూట్!
దారి తప్పిన వయోవృద్ధుడికి ఆపద్బాంధవుడిగా
వైరా అయ్యప్ప స్వామి గుడి వద్ద ఘటన
తక్షణ స్పందనతో 75 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్
108 అంబులెన్స్ సమన్వయంతో వేగవంతమైన చికిత్స
కాకతీయ, ఖమ్మం : విధి నిర్వహణలో ఉన్నా మానవత్వాన్ని మరువని అధికారిగా జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వైరా అయ్యప్ప స్వామి గుడి ప్రాంతంలో దారి తప్పి రెండు–మూడు రోజులుగా తిరుగుతున్న సుమారు 75 ఏళ్ల వయోవృద్ధుడిని గమనించి, తక్షణ చర్యలతో అతడి ప్రాణాలను కాపాడారు. వైరా వైపు వెళ్తున్న సమయంలో అక్కడి కిరాణా షాపు నిర్వాహకులు దారి తప్పి తిరుగుతున్న వయోవృద్ధుడి పరిస్థితిని డాక్టర్ రాజశేఖర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. సమాచారం అందగానే ఆలస్యం చేయకుండా ఆయన స్వయంగా అక్కడికి చేరుకుని వృద్ధుడి పరిస్థితిని పరిశీలించారు. మాట్లాడలేని స్థితిలో, తీవ్ర నీరసంతో ఉన్న వయోవృద్ధుడి పరిస్థితి విషమంగా ఉందని గుర్తించిన డాక్టర్ వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు.
అంబులెన్స్ వచ్చేలోపు ఫస్ట్ ఎయిడ్
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అతి వేగంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ వచ్చేలోపు, అలాగే అంబులెన్స్లో ప్రయాణిస్తున్న సమయంలో కూడా డాక్టర్ రాజశేఖర్ గౌడ్ స్వయంగా ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించడం విశేషంగా నిలిచింది. వయోవృద్ధుడిని తక్షణమే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్కు ఫోన్ ద్వారా పూర్తి ఆరోగ్య వివరాలు తెలియజేశారు. డాక్టర్ నరేందర్ వెంటనే స్పందించి ఆస్పత్రి సిబ్బందిని అలర్ట్ చేయగా, వైద్య బృందం సమన్వయంతో వయోవృద్ధుడికి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసు శాఖకు సమాచారం ఇచ్చి వయోవృద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు, కుటుంబ సభ్యులు ఎవరు అనే వివరాల సేకరణ కొనసాగుతోంది. గతంలో కూడా రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్న డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ చర్యపై ప్రజలు, వైద్య వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.
“ఇలాంటి అధికారులే సమాజానికి నిజమైన ఆదర్శం” అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


